విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ న్యూస్:
స్వచ్ఛ సర్వేక్షన్ లో మెరుగైన ర్యాంక్ సాధించాలంటే ప్రజల తోడ్పాటు కూడా ఎంతో అవసరమని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కె. రమేష్ పేర్కొన్నారు. బుధవారం ఆయన కాకినాడ రమణయ్యపేట మార్కెట్.ఎన్ ఎఫ్ సి ఎల్, అచ్యుతాపురం రైల్వే ట్రాక్ సమీపంలోని అవుట్ఫాల్ డ్రైన్లను సందర్శించారు. ఆయా ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. స్థానికులతో మాట్లాడి యూజర్ చార్జీల పై అవగాహన కల్పించారు. మురికివాడల ప్రాంతాల్లో నెలకు రూ 60/., ఇతర ప్రాంతాల్లో రూ 90/. రూపాయలు యూజర్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించే క్రమంలో అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. ఇంటింటికి చెత్త సేకరణ, తడి పొడి చెత్తను వేరు వేరుగా సేకరించడం, సేకరించిన చెత్తను ప్రత్యేక వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలింపు, అక్కడ చెత్తను ప్రాసెసింగ్ చేయడం… తద్వారా ప్రజల నివాసిత ప్రాంతాల్లో ఆరోగ్యకర వాతావరణాన్ని కల్పించడం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటి నిర్వహణ కోసం నిర్దేశించిన యూజర్ చార్జీలను చెల్లించి ప్రజలంతా సహకరించాలని కోరారు. యూజర్ చార్జీలను సంబంధిత సచివాలయ సిబ్బంది ద్వారా కానీ,ఆన్లైన్ ద్వారా కానీ చెల్లించవచ్చునన్నారు. మార్కెట్ ప్రాంతాలలో ప్రజల సౌలభ్యం కోసం పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా అక్కడక్కడ చెట్లు పడిపోవడం,విద్యుత్ అంతరాయం కలగడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.