విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బుధవారం తాడేపల్లి ఆయన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు, జాయింట్ కలెక్టర్ ఇలక్కియ.. వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ పనులు; రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు తదితరాల శాశ్వత భవన నిర్మాణాలు; గృహ నిర్మాణాలు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల మంజూరు, టిడ్కోగృహలు, జగనన్న భూ హక్కు, భూరక్ష, రీ సర్వే, స్పందన అర్జీల పరిష్కారం, ఖరీఫ్-2022 సన్నద్దత, విత్తనాలు, ఎరువుల పంపిణీ, జాతీయ రహదారులు, ఇరిగేషన్ పనులకు సంబంధించిన భూసేకరణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి.. జిల్లాల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం నిర్మాణాలకు అనువైన వాతావరణం ఉన్నందున ప్రభుత్వ ప్రాధాన్య శాశ్వత భవన నిర్మాణాలు, గృహ నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని సూచించారు. జూన్ నెలలో రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ, రైతులకు పంట బీమా, అమ్మ ఒడి తదితర పథకాల లబ్ధి మొత్తాల విడుదల కార్యక్రమాలు ఉన్నందున వాటిపై దృష్టిసారించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో డీఆర్వో కె.శ్రీధర్ రెడ్డి, జెడ్పీ సీఈవో ఎన్.వి.వి. సత్యనారాయణ, డీపీవో ఎస్వీ నాగేశ్వరనాయక్, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, హౌసింగ్ పీడీ బి.సుధాకర్ పట్నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ ఎం.శ్రీనివాసు సీపీవో పి.త్రినాథ్, పీఆర్ ఎస్.ఈ ఎం.శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.