కాకినాడ సిటీ, ఆగస్టు 14:, Kakinada (VISWAM VOICE DESK):
విశ్వం వాయిస్ సిటీ న్యూస్: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ 18(ఎ) బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడలో ఫ్లాగ్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. భానుగుడి సెంటర్ నుంచి బోటు క్లబ్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీ దేశభక్తి నినాదాలతో ఉత్సాహభరితంగా సాగింది.
18(ఎ) బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ మెనెజెస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేజర్ మహమ్మద్ ఆసిఫ్ నాయకత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఆర్మీ, నేవల్, ఎయిర్ వింగ్లకు చెందిన సుమారు 250 మంది ఎన్సీసీ క్యాడెట్లు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. క్యాడెట్లు చేతుల్లో మువ్వన్నెల జాతీయ జెండాలను పట్టుకుని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కల్నల్ అజయ్ మెనెజెస్ మాట్లాడుతూ, ప్రస్తుతం దేశ ప్రజలు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం వేలాది మంది సమరయోధుల పోరాటం, ధైర్యం, త్యాగాల ఫలితమన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని బలమైన, సమైక్య, ప్రగతిశీల భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
దేశ సమైక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. ఎన్సీసీ ప్రధాన ఆదర్శమైన *“సమైక్యత మరియు క్రమశిక్షణ”*కు కట్టుబడి, పూర్తి అంకితభావం, బాధ్యతతో దేశసేవలో ముందుంటామని క్యాడెట్లు ప్రతిజ్ఞ చేశారు.
కాకినాడ పరిసర ప్రాంతాల్లో దేశభక్తి, జాతీయ సమైక్యతా స్ఫూర్తిని చాటిన ఈ ఫ్లాగ్ ర్యాలీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఘనమైన నాంది పలికింది. కార్యక్రమంలో పలువురు ఎన్సీసీ క్యాడెట్లు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.

