రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:
మండల కేంద్రమైన రాయవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల స్థాయి కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. వుండవిల్లి రాంబాబు ఆధ్వర్యంలో, మండల పార్టీ అధ్యక్షుడు కొప్పిశెట్టి మాధవరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ముఖ్యంగా రాయవరం గ్రామంలోని మెయిన్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సమావేశంలో తీర్మానించారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్టును అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలిపారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడం రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ చేపడుతున్న ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు, బీఎల్వోలు, నాయకులు, అభిమానులు సమన్వయంతో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, కార్యకర్తలను సమన్వయం చేయడం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సమావేశంలో చర్చించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో రిమ్మలపూడి వేణుగోపాల దొర, వెంకట కృష్ణారెడ్డి, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, చుండ్రు వీర్రాజు (రాజు), కోట వెంకటరమణ, మతుకుమిల్లి ఉదయభాస్కరరావు, వెదురుపాక పీఏసీఎస్ అధ్యక్షుడు పిల్లి గణేష్, నదురుబాధ ఎంపీటీసీ ఉండవల్లి సుబ్బారాయుడు, మండల సెక్రటరీ నల్లమిల్లి సతీష్ రెడ్డి, దేవు శ్రీను, కొవ్వూరి సత్తిరెడ్డి, సుంకవల్లి గంగరాజు, నున్న ప్రదీప్ కుమార్తో పాటు మండలంలోని తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

