కాకినాడ సిటీ, Kakinada (VISWAM VOICE DESK):
దేశభక్తి స్ఫూర్తితో నర్సింగ్ సిబ్బంది ర్యాలీ
జాతీయ సమైక్యతను చాటిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గురువారం దేశభక్తి స్ఫూర్తితో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. “పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్” కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. లావణ్య కుమారి ఆధ్వర్యంలో జీజీహెచ్ భవనంపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి నర్సింగ్ విభాగం సిబ్బంది చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో సాగిన ర్యాలీ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
జాతీయ పతాకం పట్ల గౌరవం, దేశభక్తి, జాతీయ సమైక్యత భావాలను మరింత పెంపొందించడంతో పాటు ప్రజాసేవ పట్ల వైద్య, నర్సింగ్ సిబ్బందిలో బాధ్యతను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. లావణ్య కుమారి, సీఎస్ఆర్ఎంఓ జి. మెహర్ కుమార్, ఏఆర్ఎంఓ లావణ్య, సంబంధిత అధికారులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

