విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం సిటీ:
పేపరుమిల్లు రసాయన వ్యర్థాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళదాం
- – గోదావరి జలాల పరిరక్షణకు రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ నాయకులు
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్: రాజమహేంద్రవరం ప్రజలు తాగేందుకు పరిశుభ్రమైన నీరు, రేవుల్లో స్నానాలు చేసేందుకు స్వచ్ఛమైన జలాలు ఇచ్చేవరకు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పోరాటం చేస్తుందని నాయకులు స్పష్టంచేసారు. సేవ్ గోదావరి`సేవ్ రాజమహేంద్రవరం నినాదంతో స్థానిక ఎపి పేపర్మిల్లు ఎదురుగా ఉన్న శ్రీకృష్ణసాయి కళ్యాణ మండపంలో ఓఎన్జిసి రిటైర్డ్ ఇడి/అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్ ఆధ్వర్యంలో జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.ఎం.ఆర్.శేఖర్ మాట్లాడుతూ పేపరుమిల్లు రసాయన వ్యర్థాల వల్ల గోదావరి జలాల ఏవిధంగా కలుష్యంబారిన పడుతున్నాయనేది నేషనల గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకు వెళదామని చెప్పారు.ఆదివారం పుష్కర ఘాట్ వద్ద జరిగే బహిరంగ సభలో వాటర్ మేన్ ఆఫ్ ఇండియా గా పేరుగాంచిన రాజేంద్ర సింగ్ కు అన్ని విషయాలు వివరంగా తెలియచేయాలని సమావేశం నిర్ణయించింది. స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ వైసిపి నాయకులు బర్రే కొండబాబు మాట్లాడుతూ టి.కె విశ్వేశ్వర రెడ్డి చేస్తున్న దీక్షకు నాయకులు,ప్రజలు సంఘీభావం తెలిపి నదీ జలాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో జేఏసీ నాయకులు పోలు విజయలక్ష్మి, డాక్టర్ అనుసూరి పద్మలత, వక్ప్బోర్డు జిల్లా చైర్మన్ ఎండి ఆరిఫ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్ధాపకుడు సానబోయిన రామారావు, చైర్మన్ కెకె సంజీవరావు, ఎల్వి ప్రసాద్, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జేటీ రామారావు, ప్రముఖ న్యాయవాది మర్రి బాబ్జీ, సిపిఐ తరపున వంగమూరి కొండలరావు, బొమ్మసాని రవిచంద్ర, ఆమ్ ఆద్మీ సిటీ కన్వీనర్ అత్తిలి రాజు,ఇన్నీసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గుత్తుల భాస్కర్, కొంచాడ ఈశ్వర్, ఉప్పాడ కోటిరెడ్డి, దుంగ మీరా సురేష్ తదితరులు మాట్లాడారు.పేపర్మిల్లు దిగొచ్చి రసాయన వ్యర్ధాలను కలపబోమని హామీ ఇచ్చే వరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు.